బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగింది శూన్యం: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

  • అంకెల గారడీ తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనంలేదన్న ప్రశాంత్ రెడ్డి
  • అవినీతికి అవకాశం ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించారన్న మాజీ మంత్రి
  • ఆరు గ్యారెంటీలకు మంగళం పాడారన్న ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఈ బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగేది శూన్యమని విమర్శించారు. ఇది అంకెల గారడీ తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనంలేదని అన్నారు. ఈ బడ్జెట్ ప్రజలను మోసం చేసేదిగా ఉందని మండిపడ్డారు. మహిళలు, పేదలు, నిరుద్యోగులు, రైతులు ఇలా ఎవరికీ ఉపయోగపడని బడ్జెట్ అన్నారు.

ప్రజలకు ఉపయోగపడే పథకాలు, కేటాయింపులు ఒక్కటీ బడ్జెట్‌లో కనిపించలేదని విమర్శించారు. అవినీతికి అవకాశం ఉన్న ప్రాజెక్టులకు భారీ మొత్తంలో నిధులు కేటాయించారని ఆరోపించారు. గత బడ్జెట్ అంచనాలను అందుకోవడంలోనే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కానీ ఇప్పుడు మరోసారి అంకెలతో మాయచేసే ప్రయత్నం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

ఈ బడ్జెట్‌లో కూడా ఆరు గ్యారెంటీలకు మంగళం పాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, వితంతు పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామన్న హామీలను నెరవేర్చలేదని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదని అన్నారు. రైతులకు ఇచ్చే రైతు భరోసాను కూడా ఎగ్గొట్టారని విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి, ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.

Vemula Prashanth Reddy
Telangana Budget 2024
BRS MLA
Congress Government
Revanth Reddy

More Telugu News